పాత్రికేయుల శిక్షణ, సంక్షేమం కోసం మీడియా అకాడమీ కృషి చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సింగరేణి మహిళా కళాశాలలో మీడియా అకాడమీ ద్వారా రెండు రోజుల పాటు నిర్వహించనున్న పాత్రికేయుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం ప్రత్యేకమైన వృత్తి అని నిలబడి ముందుకు సాగాలని చెప్పారు. పాత్రికేయులకు ఇలాంటి శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా పాత్రికేయులు ఆలోచన చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ద్వారా పాత్రికేయులు విధి నిర్వహణలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఆయన చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారని చెప్పారు. పాత్రికేయుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. కేటాయించిన విధంగా ఇప్పటి వరకు 42 కోట్లు మంజూరు చేసారని వాటిలో ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయలు పాత్రికేయుల సంక్షేమానికి వినియోగించినట్లు చెప్పారు.
పాత్రికేయుల కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్ధిక సాయం
ఇంకనూ 58 కోట్లు మంజూరు కావాల్సి ఉందని, విడతలు వారిగా మంజూరు కానున్నట్లు చెప్పారు. మంజూరు చేసిన నిధుల మూలధనం నుండి పాత్రికేయుల సంక్షేమానికి వినియోగించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 490 పైగా పాత్రికేయుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా లక్ష రూపాయలు ఆర్ధిక సాయం మంజూరుతో పాటు, ప్రతి నెలా 3 వేల రూపాయలు పింఛను, చదువుకునే పిల్లలకు వేయి రూపాయలు ఉపకార వేతనాలు మంజూరు చేసినట్లు చెప్పారు.
కరోనా కష్టకాలంలో 5 వేల మంది పాత్రికేయులకు 7 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు చెప్పారు. కరోనా వంటి బయానక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులను ఆదుకున్నదని ఇదంతా ప్రభుత్వం గుర్తించడం వల్ల సాధ్యమైనట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డులు ద్వారా ఈ ఆరేండ్ల కాలంలో 33 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు పాత్రికేయులు వినియోగించుకున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి ఖమ్మం వచ్చిన సందర్భంలో పాత్రికేయులకు ఇండ్లస్థలాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఖమ్మంలో ఇంటి స్థలాలు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, రానున్న అతికొద్ది రోజుల్లో అన్ని జిల్లాలలో పాత్రికేయులకు ఇంటిస్థలాలు మంజూరు అవుతాయని ఆయన చెప్పారు. కొత్తగూడెంలో కూడా 15 ఎకరాల్లో ఇంటి స్థలాలు ఇవ్వడానికి గుర్తించారని చెప్పారు.
ఆధునిక జర్నలిజం పై అవగాహన అవసరం
ఆధునిక జర్మలిజంపై పాత్రికేయులకు సమగ్రమైన అవగాహన అవసరమని చెప్పారు. పాత 10 జిల్లాలలో 8 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి అన్ని జిల్లాలలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు మీడియా అకాడమీ ద్వారా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పాత్రికేయంలో వేగం పెరిగిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులకు శిక్షణ తప్పనిసరి అని చెప్పారు.
నాణ్యమైన వార్తలు ప్రజలకు చేరవేయడంలో శిక్షణా కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి మనం వార్తలను అందించాలని చెప్పారు. అనుభవంతో పాటు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మారుతున్న పాత్రికేయంలో పోటీతత్వంతో వాస్తవాలను ప్రజలకు తెలియచేయడంలో ముందుండాలని చెప్పారు. తెలంగాణ పోరాటంలో ఉదృతంగా పాల్గొన్నారని, అస్తిత్వంతో పోరాడారని, అనేక శక్తులతో కలిసి నడిచామని, ఉద్యమ సమయంలో ఇది కాదనలే సత్యమని చెప్పారు. చైతన్యాన్ని ప్రదర్శించింది పాత్రికేయులేనని చెప్పారు. అనంతరం సోషల్ మీడియా ధోరణులు అనే అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ సుధాకర్ రెడ్డి, గ్రామీణ వార్తలు అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు రమణారావులు పాత్రికేయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, టియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి మారుతిసాగర్, సీనియర్ పాత్రికేయులు యోగానంద్, విష్ణువర్ధన్, టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాసరావు, ఖమ్మం అధ్యక్షులు ఆదినారాయణ, వట్టికొండ రవి, సీహెచ్ నరసింహారావు, చండ్ర నరసింహరావు, షఫి, బాలయోగి, అకాడమీ మేనేజర్ వెంకటేశ్, ఓఎస్డీ రహమాన్, వనజ, జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన మీడియా అకాడమీ ఛైర్మన్ కు డిపిఆర్ శ్రీనివాస్ మొక్కను బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు.