జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాను నివారించి వారిపై చర్యలను తీసుకోవలసిందిగా ప్రభుత్వ అధికారులను, డీఎంహెచ్వో ను మొజ్జాడ యుగంధర్ కోరారు. సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఏఐవైఎఫ్ ఆముదాలవలస నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా మెడికల్ మాఫియా వలన పేద ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే వారు O.P ఫీజు, అలాగే బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ల పేరుతో పెద్ద మొత్తంలో పేద ప్రజల దగ్గర ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వేలాది రూపాయలు దోపిడీకి గురిచేసి, పేదల ప్రజల రక్తాన్ని జలగల్లా పిండి వసూలు చేస్తున్నారని ఈ విషయంపై తక్షణమే అధికారులు స్పందించి ప్రైవేట్ ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో పనిచేయకుండా సొంత క్లినిక్ లు ఏర్పాటు చేసుకొని వారు ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పుడొస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ నాయకులు కర్ణ వీరుడు, రమణ పాల్గొన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ ఆమదాలవలస నియోజకవర్గం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడిగా G.వెంకటరమణ, కార్యదర్శిగా S. సింహాచలం, సహాయ కార్యదర్శులుగా G. శివకుమార్, K. వెంకటేష్, ఉపాధ్యక్షులుగా S. విజయ్ కుమార్, N. రామినాయుడు, కోశాధికారిగా M. కూర్మయ్యలను ఎన్నుకున్నారు.