కరోనా సమయంలో కొత్త వ్యాపారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి వ్యాపారం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందానికి మెరుగులు దిద్దే బ్యూటీ పార్లర్ను ఐసోలేషన్ సెంటర్గా మార్చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని కలర్స్ బ్యూటీ పార్లర్లో ఈ దందా జరుగుతోంది. కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఆశ్రయం ఇస్తూ రోజుకు రూ.10వేల ఫీజు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకిస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు అడ్డుకున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు.