వారంలోగా ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తామని చెప్పినట్లే మెగాస్టార్ చిరంజీవి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆక్సిజన్ పంపిణీ జరిగింది.
అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు నేడోరేపో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్సన్ట్రేటర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి.
ప్రతి జిల్లాలలో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే నిర్వాహకులు బ్యాంకు నుంచి సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణా, ఏపీల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది.
ఇక్కడ స్కేర్సిటీ ఉండటం వల్ల చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆర్డర్ చేశాం. ప్రస్తుతం చాలా చోట్ల వీటి కొరత నెలకొంది. అత్యవసరం ఎక్కడ ఉందనేది తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాలకు అవసరం ఉన్న అన్నిచోట్లకు పంపిణీ చేస్తాం. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు ఏ టైంలో ఎక్కడెక్కడకు చేరుకుంటున్నాయనే ట్రాకింగ్ పరికరాన్ని కూడా టెక్నీషియన్లు ప్రతిచోటా ఏర్పాటు చేస్తున్నారు.
దీనీపై చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్ని చోట్లా ఇది సద్వినియోగం కావాలనే మా ప్రయత్నం. రామ్ చరణ్ ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు” అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతవల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు.