పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ములుగు జిల్లాకు మంజూరైన మినీ డైరీ యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మినీ డైరీ వెంకటాపూర్ మండల లబ్ధిదారులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డైరీ యూనిట్లను సంరక్షించుకొని, ఆదాయ వనరులుగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఒక సొసైటీ ఏర్పాటుచేసి, దాని నిర్వహణలో డైరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
లబ్ధిదారులు ఎవరికి వారు యూనిట్లను పోషించడం, వాటితో లబ్ధి పొందడం వ్యయప్రయాసాలతో కూడుకున్నదని, ఇది అంతగా విజయవంతం కాదని ఆయన అన్నారు.
అందరూ సమిష్టిగా ఒక సొసైటీ ఏర్పరచుకొని, వారే పారదర్శకంగా అకౌంట్ నిర్వహిస్తూ, అనుభవజ్ఞులైన పనివారాలతో నిర్వహణతో, లబ్దిదారులందకి నికరలాభం ప్రతి నెల ఆదాయంగా వస్తుందన్నారు. మంచి పాలకు డిమాండ్ ఉందని, జిల్లాకు ఒక ఆస్తిగా మారాలని అన్నారు.
ఈ ప్రక్రియలో ప్రతి లబ్దిదారున్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. ములుగు, వెంకటాపూర్ మండలంలో ఎంపిక అయిన లబ్దిదారులతో విజయవంతంగా నిర్వహిస్తున్న డైరీల సందర్శన చేయించాలని, ఒక మోడల్ డెయిరీ గా రూపకల్పనకు చర్యలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఇదివరకు మంజూరై గ్రౌండింగ్ అయిన యూనిట్లలో మూతపడిన, సక్సెస్ అయిన యూనిట్ల లబ్దిదారులతో ముఖాముఖి కల్పించి, వారి అనుభవాలను పంచుకోవాలన్నారు.
ప్రభుత్వం నుండి డైరీ ఏర్పాటుకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. డైరీ లాభాలను ఎప్పటికప్పుడు సంబంధిత లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.
ములుగు, వెంకటాపూర్ మండలాల లబ్దిదారుల కొరకు జాకారంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో షెడ్డు, వసతులు, ఇంచెర్లలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో గడ్డి పెంపకం చేపడతామన్నారు.
ప్రాజెక్ట్ అమలులో ఇడి ఎస్సి కార్పొరేషన్ కన్వీనర్ గా, సహకార అధికారి, పశు సంవర్థక అధికారి, గ్రామీణాభివృద్ధి అధికారిని భాగస్వామ్యం చేశామన్నారు. సమిష్టిగా పనిచేసి ఆదర్శ డెయిరీ గా రూపకల్పన చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇడి ఎస్సి కార్పొరేషన్ తుల రవి, జిల్లా సహకార అధికారి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా పశు సంవర్థక అధికారి విజయ భాస్కర్, వెంకటాపూర్ ఎంపిడిఓ శ్రీధర్, వెంకటాపూర్ మండల లబ్దిదారులు పాల్గొన్నారు.