లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రభుత్వం సూచించిన సమయంలో బయటకు వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగర్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న కూరగాయల మార్కెట్ కు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారని అలా చేయరాదని అన్నారు.
అందుకోసమే అన్ని కూరగాయల మార్కెట్ లను కరీంనగర్ ఆర్టీసి బస్టాండ్ లో ఏర్పాటు చేసారు. సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన మార్కెట్ ను మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, మునిసిపల్ కమిషనర్ క్రాంతి పరిశీలించారు. మంత్రి గంగుల మాట్లాడుతూ రెడ్ జోన్ తో పాటు నగర వ్యాప్తంగా లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం వలన అలాగే ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది అని తెలిపారు. ఎక్కడి వారికి అక్కడ సౌకర్యాలు ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా జమ కావద్దు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.