కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇటీవల విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి హస్తిన నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్ల తో మాట్లాడారు.
సామాజిక దూరం మాత్రమే వ్యాధి వ్యాప్తిని నిరోధించే అవకాశం కలిగి ఉన్నదని అన్నారు. కరోనావ్యాప్తికి వ్యతిరేకంగా దేశం మొత్తం తగిన సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని, మరోవైపు ఒంటరిగా, సామాజిక దూరాన్ని కొనసాగించ వలసిన అవశ్యకత కీలకమైనదని స్పష్టం చేసారు.
ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రార్థనల పేరిట సమావేశాలు వద్దని మత పెద్దలు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇండియన్ రెడ్క్రాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, ఆశ్రయం, వలస కూలీలకు ఆహారం ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు, జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. వైరస్ గురించి అవగాహన కల్పించి, ఇతర రాష్ట్రాల విద్యార్థులను జాగ్రత్తగా చూసుకునేలా చిత్ర పరిశ్రమ, సాహిత్య సంస్థలు, ప్రైవేటు రంగ సేవలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించారు. వీడియో సమావేశం అనంతరం ఈ విషయంపై రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర ఎన్జిఓల భూమిక లను సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ బిశ్వ భూషణ్ పేర్కొన్నారు. బిచ్చగాళ్ళు, నిరాశ్రయులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం తగిన సహాయం అందించాలన్నారు.