విజయనగరంలోని ప్రేమసమాజం వృద్ధుల ఆశ్రమంలో 68 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన వసతి సముదాయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విశాఖ డెయిరీ ట్రస్టు ఆర్ధిక సహయంతో ట్రస్టు ఈ భవనాన్ని నిర్మించింది. విశాఖ డెయిరీ ట్రస్టు ఛైర్మన్ ఆడారి తులసీరావు పేరుతో ‘తులసీ భవన్’ గా ఈ అదనపు వసతి సముదాయానికి పేరు పెట్టారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద విశాఖ డెయిరీ ట్రస్టు వృద్ధులు, అనాథలైన వృద్ధుల కోసం ఈ వసతి సముదాయాన్ని నిర్మించినందుకు మంత్రి విశాఖ డెయిరీ ట్రస్టును అభినందించారు. కొత్తగా నిర్మించిన 8 గదులతో ఇక్కడ అదనపు వసతి కల్పించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎం.ఎల్.సి. పెన్మత్స సురేష్ బాబు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, విశాఖ డెయిరీ ట్రస్టు వైస్ చైర్మన్ ఆడారి ఆనంద్, జాయింట్ కలెక్టర్ డా.జే.సీ.కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ. భవానీశంకర్, తహశీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.