తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించింది. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ కలిగిన ప్రతి మగ్గానికి మూడు వేల రూపాయలు చేనేత కార్మికుని ఖాతాలో జమ చేస్తామని ప్రకటించి, సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల ఖాతాల్లో 2000 రూపాయలు చొప్పున, ఇద్దరు అనుబంధ కార్మికుల ఖాతాలో 500 రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది.
దీంతో చేనేత వృత్తిలో కొనసాగుతున్న వేల మంది కళాకారులకు ఆర్ధిక సాయం లభించింది. అలాగే నేతన్నకు భీమా పథకంలో 59 సంవత్సరాల వయసు పరిమితిని సడలించి 75 సంవత్సరాలకు పెంచినందుకు చేనేత వృత్తిలో కొనసాగుతున్న నిరుపేద వృద్ధ కళాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా ఏ కారణం చేతగాని నేత కార్మికుడు చనిపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల సహాయం అందనున్నది.
ఇవే కాకుండా మరణించిన చేనేత కార్మికుడి కుటుంబాలకి తక్షన అవసరాల నిమిత్తం జౌళి శాఖ నుండి 25 వేల రూపాయలు సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఉపయోగకరం. నేత కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి సంవత్సరానికి 25 వేల రూపాయల వరకు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ వైద్యం లభించే సౌకర్యం కల్పించడంతో పాటు నేత కార్మికులందరిని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం వల్ల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఇన్ని పథకాలు రూప కల్పన చేసి అమలుపరుస్తున్నందుకుగాను చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద రావు ని, తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎల్ రమణ ద్వారా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిసిన జగిత్యాల పద్మశాలి నాయకులు ధన్యవాదాలు తెలిపారు.