తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఎనముల రేవంత్రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి పద్దతి మార్చుకోవాలని, మార్చుకోని పక్షంలో తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని టీపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి హెచ్చరించారు. గురువారం ఏఎస్రావునగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి పిసీసీ అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి మల్లారెడ్డికి మతి భ్రమించిందని అన్నారు.
దళితులందరికి దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ ఇంద్రవెల్లి, రావిర్యాలలో ఏర్పాటు చేసిన దళిత,గిరిజన సభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన 48 గంటల దళిత,గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నాయకులకు ముచ్చెమటలు పడతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మూడుచింతలపల్లి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేని విషయంతో పాటు మంత్రి మల్లారెడ్డి చేసిన కబ్జాలు నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మంత్రికి సవాలు చేసే నైతిక హక్కులేదని అన్నారు. ఆరువందల ఎకరాల స్థలం ఉందని స్వయంగా ప్రకటించిన మంత్రి మల్లారెడ్డి ఆ స్థలాలు ఎక్కడినుండి వచ్చాయో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని సోమశేఖర్రెడ్డి అన్నారు. తగిన సమయంలో టీఆర్ఎస్కు బుద్దిచెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా అసభ్య పదజాలంతో ఎదుటి వారిని దూషించడం మూనుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.