వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రయోగాత్మకంగా ఆలుగడ్డ సాగు చేశారు. మన నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో పావు ఎకరాలో చేసిన ఆలుగడ్డ సాగు .. దిగుబడి, ఆలుగడ్డ నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. మార్కెట్లో ఆలుగడ్డకు డిమాండ్ ఉంది. మార్కెట్లో ధర కూడా స్థిరంగా ఉంటుంది.
గరిష్టంగా ఎకరానికి 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాలు ధర రూ.1000 నుంచి రూ.1200 వరకూ ఏడాది పొడవునా ఉంటోందని మంత్రి వెల్లడించారు. ఒక్కోసారి క్వింటాలుకు రూ.2 వేలు కూడా పలుకుతుందని మంత్రి తెలిపారు.
పెట్టుబడి పోను రైతుకు ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతుందని ఆయన అన్నారు. దేశంలో అత్యధిక శాతం మంది తినే కూరగాయలలో ఆలుగడ్డ ఒకటి.
దక్షిణాది రాష్ట్రాలలో పెద్దగా సాగుచేయక పోవడం మూలంగా ఉత్తరాది రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. ఎకరా ఆలుగడ్డ సాగుకు రూ.45 వేల దాకా పెట్టుబడి ఖర్చవుతుంది. మొక్క నాటాక 85-90 రోజుల్లో పంట కోతకు వస్తుంది .. వంటకాలం పెరిగితే దిగుబడి పెరుగుతుంది అని ఆయన అన్నారు.