Slider ముఖ్యంశాలు

జోగులాంబ అమ్మవారి సాక్షిగా అసత్యాలు చెప్పడం మానుకోండి

#ministerniranjanreddy

రెండో విడత యాత్ర చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. యాత్ర ప్రారంభం సందర్భంగా జోగులాంబ సన్నిధి నుంచి ఆయన మాట్లాడిన మాటలన్నీ అవాస్తవాలేనని మంత్రి అన్నారు.

మంత్రి సంధించిన ప్రశ్నలు ఇవి:

2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నరేంద్రమోడీ స్వయంగా చెప్పింది నిజం కాదా ? దానిని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టింది నిజం కాదా ?

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పావలా ఇయ్యనిది నిజం కాదా ? కనీసం ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నడయినా తెలంగాణ బీజేపీ నేతలు నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? ఇదే మీకు ఉమ్మడి పాలమూరు జిల్లా మీద ఉన్న ప్రేమనా ?

నడిగడ్డకు, ఉమ్మడి పాలమూరుకు నష్టం కలిగించే కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఎందుకు ఇవ్వదు ? బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఎందుకు నోరు తెరిచి అడగరు ?

ఏడేళ్లుగా కృష్ణా నదిలో నీటి వాటాలు తేల్చకపోవడమే మీ గొప్పతనమా ? కృష్ణా నది వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు పేరుతో కుట్రలు చేస్తున్నది నిజం కాదా ? తెలంగాణ నీటి వనరులను గుప్పిట పట్టాలని భావిస్తున్నది నిజం కాదా ?

తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కిషన్ రెడ్డి చెప్పింది నిజం కాదా ? వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం ? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది.. కొనిపించే బాధ్యత నాది. రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్ చెప్పింది నిజం కాదా ? ఆ తర్వాత రా రైస్ .. బాయిల్డ్ రైస్ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా ? ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ?

తెలంగాణ రైతులకు ఇస్తున్న సాగునీళ్లు, రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు, రైతుభీమా పథకాలలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఆఖరుకు పంటలు సేకరించాల్సిన బాధ్యత నుండి కూడా కేంద్రం తప్పించుకుంటే తెలంగాణ రైతాంగం తరపున కనీసం ప్రశ్నించలేని మీరు ఈ ప్రాంత ప్రతినిధులా ? అసలు మీకు ప్రజలను వంచించే హక్కు ఎవరిచ్చారు ?

కేంద్రప్రభుత్వం నుండి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసిన ఒక్క మేలయినా ఉందా ?

దక్షిణ భారతదేశంలో 5వ శక్తిపీఠంగా ఉన్న అలంపూరు జోగుళాంబ అమ్మవారి ఆలయం పరిసరాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏ అభివృద్ది పనిని చేపట్టలేకపోతున్నది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్దికి కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్టను రూ.1200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకువచ్చి జోగుళాంబ  ఆలయాన్ని అభివృద్ది చేయిస్తాం అని వాగ్దానం చేసే దమ్ముందా ?

యాదాద్రిని కేసీఆర్ దేశంలో ఒక దివ్యమైన క్షేత్రంగా తీర్చిదిద్దారు. నిత్యం దేవుడి పేరు మీద ఓట్లు దండుకునే మీరు కనీసం దక్షిణ కాశీ అమ్మవారి ఆలయాన్ని అయినా అభివృద్దిపరచగలరా ?

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన జోగుళాంబ బరాజ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా కేంద్రం నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అనుమతులు తీసుకురాగలరా ?

దశాబ్దాలుగా పాలమూరు, కందనూలు, గద్వాల ప్రాంత  ప్రజల కల గద్వాల – మాచర్ల  రైల్వే లైన్ ను దేశంలో అన్నిచోట్లా కేంద్రం నిర్మిస్తున్నట్లు  ఇక్కడ కూడా నిర్మించేలా కేంద్రం నుండి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తాం అని చెప్పే ధైర్యం ఉందా ?

ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాదయాత్ర చేయాలి. ప్రజలను మభ్యపెట్టి, అబద్దాలతో కాలం వెళ్లదీసే తప్పుడు పనులు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హితవు పలికారు.

Related posts

బతుకమ్మ, విజయదశమి పండుగలపై విద్వత్ సభ నిర్ణయం

Satyam NEWS

కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Satyam NEWS

ఇప్పడు జరుగుతున్న గేమ్ ముందే చెప్పిన రాధాకృష్ణ

Satyam NEWS

Leave a Comment