జమ్మూకశ్మీర్లోని బండీపొర జిల్లా బ్రార్ అరాగామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ పై గురువారం జరిగిన దాడిలో నిందితులుగా ఉన్న ఇద్దరు ఈ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. సలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు.
పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులైన వీరిద్దరూ ఈ నెల 11న జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు కశ్మీర్ ఐజీ చెప్పారు. ఇలా ఉండగా, రాహుల్ భట్ను ఉగ్రవాదాలు కాల్చిచంపడంపై అతని భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణ చేసింది. తన భర్తను చంపేందుకు అతని కార్యాలయ సిబ్బంది ఉగ్రవాదాలతో కలిసి కుట్ర సాగించి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది.
ఎవరో తన భర్త గురించి అడిగినప్పుడు అవతల వాళ్లు చెప్పి ఉండకపోతే ఉగ్రవాదులకు రాహుల్ గురించి ఎలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి తనను బదిలీ చేయాలని పలు సందర్భాల్లో స్థానిక యంత్రాగానికి తన భర్త విజ్ఞప్తి చేశాడని, అయినప్పటికీ అతన్ని బదిలీ చేయలేదని ఆమె వాపోయింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని రాహుల్ భట్ తండ్రి డిమాండ్ చేశారు.
“వచ్చిన వాళ్లు మొదట రాహుల్ భట్ ఎవరని అడిగారు. ఆ తర్వాతే అతనిపై కాల్పులు జరిపారు. ఘటనా స్థలికి 100 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆఫీసులోనూ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఒక్కరు కూడా అక్కడ లేరు. సీసీటీవీ ఫుటేజ్ను చూస్తే అసలు విషయం తెలుస్తుంది” అని ఆయన తెలిపారు. కశ్మీరీ పండిట్ను హత్య చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది.