వారం రోజుల క్రితం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆకస్మికంగా పరిశీలించారు. ఆకస్మిక తనిఖీ చేసిన వాటిలో ఖమ్మం పత్తి మార్కెట్, రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో శ్రీ సాయిబాలాజీ జిన్నింగ్ మిల్లు, పొన్నెకల్, మేడేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం, తేమ శాతం పరీక్షా కేంద్రం ఉన్నాయి.
మంత్రి పువ్వాడ తో బాటు జిల్లా కలెక్టర్ RV కర్ణన్, జేసీ హనుమంత్ కోడింబా, మేయర్ పాపాలాల్, DRDA PD ఇందుమతి, జిల్లా వ్యవసాయ అధికారిణి ఝాన్సీ లక్ష్మీ కుమారి, AMC చైర్మన్ వెంకటరమణ తదితరులు ఉన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ఈ ఏడాది ధాన్యం, పత్తి సాగు విస్తారంగా వచ్చిందని, అందుకు అనుగుణంగా ప్రతి రైతు నుండి పత్తి, ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి పువ్వాడ తెలిపారు. పత్తి మద్దత్తు ధర రికార్డ్ స్థాయిలో రూ. 5,500 కల్పించామని మంత్రి అన్నారు.