అనాథల బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం రోజు విశాఖపట్నంలోని భీమునిపట్నం వద్ద గల SOS విలేజ్ ను, సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హొలీ కేరి, హానుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్నేహ శబరీష్ జీహెచ్ఎంసీకి అడిషనల్ కమిషనర్ ఇతర అధికారులతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అనాధలను రాష్ట్ర ప్రభుత్వం హక్కున చేర్చుకుంటుందని తెలిపారు. వారిని అనాధలుగా కాకుండా రాష్ట్ర పిల్లలుగా భావిస్తామని చెప్పారు. వారి బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్ వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సబ్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. వారు భవిష్యత్ లో స్థిర పడే విధంగా, వారు ఓ కుటుంబాన్ని ఏర్పరచుకునే వరకు వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి భవిష్యత్ అంధకారంగా మారకుండావిద్యా, ఉద్యోగం, ఉపాధి, కుటుంబం ఇలా వారు ఏర్పటు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. విశాఖలో పట్నంలోని ఎస్వీఎస్ చిల్డ్రన్స్ విలేజ్ లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను తెలుసుకునేందుకు సబ్కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.