హన్వాడ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న క్రమంలో హన్వాడ మండలం చిన్నదర్పల్లికి చెందిన బాలకిషన్ రావు అనే రైతు పొలంలో వరి నాట్లు వేస్తుండగా అది గమనించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కాన్వాయ్ ని రోడ్డు పక్కన పెట్టి పొలంలో దిగి నాగలితో పొలం దున్ని గొర్రుతో కరిగెట చేశారు. అనంతరం ఎరువు చల్లారు.
మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఉచితంగా నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంటు చాలని అన్నదాతను ఆగం చేసేందుకు కుట్ర చేస్తోందని అక్కడున్న రైతులతో మంత్రి పేర్కొన్నారు.
ఇక స్వయంగా మంత్రి పొలంలో దిగి నాటు వేయడంతో రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.