ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనార్టీల సంక్షేమం పూర్తిగా అటకెక్కిందని, ఆ మంత్రిత్వ శాఖ అధ్వాన్న దశకు చేరుకుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ఆరోపించారు. మైనార్టీ మంత్రిత్వ శాఖ పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైంది అని ఆయన అన్నారు.
2017, 18, 19వ సంవత్సరాలలో విదేశీ విద్య పథకం ద్వారా విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించడానికి దాదాపు 350 మంది దరఖాస్తు చేసుకుని విదేశాలకు వెళ్లారని ఆయన తెలిపారు.
అక్కడకు వెళ్లిన వారికి ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకపోవడంతో దేశం కాని దేశం లో తినడానికి తిండి లేక ఉండటానికి వసతి లేక నరక యాతన పడుతున్నారని ఆయన అన్నారు. గత పది రోజులుగా ప్రాధేయపడుతున్నా అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
బాధ్యతారాహిత్యంగా మైనారిటీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం. కనీసం వేరే శాఖ అధికారులు ఇదే విషయంపై చూపించిన చొరవ మైనారిటీ శాఖ అధికారులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ చెయ్యకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.
ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న రావత్ ఇంతకు ముందు మైనారిటీ విభాగాన్ని చూసే వారు. అంటే మైనారిటీ విభాగంపై పూర్తి అవగాహన ఉంటుంది. ఐనా కానీ పనిలో జాప్యం జరుగుతుంది అంటే మైనారిటీలపై వివక్ష అధికారుల్లో సైతం మొదలయ్యిందా అన్న సందేహం రాష్ట్ర మైనారిటీ వర్గాల ప్రజల్లో మొదలవుతుందని ఆయన అన్నారు.
అర్హులైన ప్రతి విద్యార్థికి విదేశీ విద్య పథకం ద్వారా రావలసిన నగదును అందించాలని, యధాతధంగా విదేశీ విద్య పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాడేపల్లి లోని మైనారిటీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని షిబ్లీ హెచ్చరించారు.