గత 10 సంవత్సరాల్లో ఆయా స్కీమ్ ల వారీగా మంజూరు అయిన నిధులు, వాటి ఖర్చు, పూర్తి చేసిన పనులు తదితర పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని వనపర్తి శాసన సభ్యుడు తూడి మేఘా రెడ్డి అధికారులకు సూచించారు. వనపర్తి నియోజకవర్గం నుండి శాసన సభ్యులుగా ఎన్నికైన తర్వాత సోమవారం సాయంత్రం తొలిసారిగా స్థానిక ఐ.డి. ఒ.సి. ప్రజావాణి హాల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అధ్యక్షతన జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శాసన సభ్యులుగా ఎన్నికై ఐ.డి ఒ .సి లోకి తొలిసారి వస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్, అదనపు కలెక్టర్ ఎస్. తిరుపతి రావు శాసన సభ్యులకు పుష్ప గుచ్ఛం, శాలువాతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించారని జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను ప్రశంసించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో తొమ్మిదవ తేదీన రెండు గ్యారంటీలను మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయాన్ని 10 లక్షలకు పెంచటం అమలు చేయటం జరిగిందన్నారు. రెండు మూడు రోజుల్లో వనపర్తి జిల్లాలో ఆయా శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తామని, అందువల్ల ఇంజనీరింగ్, మున్సిపాలిటీ, వ్యవసాయ అనుబంధ శాఖలు తదితర అన్ని శాఖల పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేవిదంగా ఆయా శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, స్థానిక శాసన సభ్యులు తో కలిసి శాఖల వారీగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందనీ, శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎస్ తిరుపతి రావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్