ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం (AP IASOWA) తమ ఉదారత చాటుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వారి సతీమణి పద్మప్రియ అధ్యక్షతన గల ఏపీ ఐఏఎస్ఓడబ్ల్యూఏ ఆధ్వర్యంలో గుణదలలోని విజయ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ యొక్క బాత్ రూంలు, వాష్ రూంల ఆధునీకరణకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించడంతో పాటు అదనపు సాయాన్ని సమకూర్చింది.
ఈ స్కూల్ వేదికగా గురువారం నిర్వహించిన సెమి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘ సభ్యులైన సోలమన్ ఆరోఖ్య రాజ్ సతీమణి అనితా సోలమన్, కాటంనేని భాస్కర్ సతీమణి ప్రభా భాస్కర్, ఎ.ఎండి. ఇంతియాజ్ సతీమణి సబీనా, పి. రంజిత్ భాషా సతీమణి భాను హాజరయ్యారు. ఈ వేడుకల్లో విభిన్న ప్రతిభావంతులు, ఆంధులు, పాఠశాల పిల్లల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అంధ విద్యార్థులు పాడిన పాటలు, డ్యాన్స్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘ సభ్యులు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ ను వినియోగించడం భవిష్యత్ లో మానవాళి మనుగడకు ముప్పు అని, అందరూ ప్లాస్టిక్ వాడకం నిషేధించి గుడ్డ సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే అందరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు, అంధ విద్యార్థులు, పిల్లలతో వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంధ విద్యార్థులతో భారీ కేక్ కట్ చేయించి, పిల్లలకు తినిపించారు. అనంతరం పిల్లలతో కలిసి కూర్చుని… విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. వారి కరతాళ ధ్వనులతో విద్యార్థులను ఉత్తేజ పరిచారు.
విజయ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ కరస్పాండెంట్ సిస్టర్ అమల మాట్లాడుతూ.. అవినీతిని రూపుమాపడానికి, దేశ అభివృద్ధికి ఐఏఎస్ అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఐఏఎస్ అధికారుల సతీమణులు సంఘం అందించిన తోడ్పాటుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ జయరాణి, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.