ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెపుతున్నట్టుగానే ఇటీవల జేఎన్టీయూ కాలేజీ వస్తుందన్న ప్రచారంతో రఘునాథపాలెం మండలంలో సుమారు 30 ఎకరాల్లో గుట్టను తవ్వి రూ.200కోట్ల విలువైన మట్టిని అమ్ముకున్నారని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మమ్మద్ జావేద్ ద్వజమెత్తారు. గుట్టను తవ్వి, మట్టిని తరలించిన తరువాత జెఎన్టీయూ కాలేజీ పాలేరు నియోజకవర్గానికి తరలిపోయిందని ప్రకటించడం పూర్తిగా మోసపూరితమైన విధానమని జావేద్ విమర్శించారు.
ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహ్మద్ జావేద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నియోజక వర్గంలో అవినీతి జరుగుతుందని మేము మొదటినుంచి చెప్తున్న అక్షరసత్యమైందని జావేద్ పునరుద్ఘాటించారు. ప్రధానంగా రఘునాథపాలెంలోని జింకలతాండలో ఏర్పాటు చేస్తామన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఎటు పోయిందని ప్రశ్నించారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ వస్తుందన్న ఆశ చూపి 30 ఎకరాల్లో ఉన్న గుట్టని తవ్వి కోట్లాది రూపాయల విలువైన మట్టిని అమ్ముకున్నారని ద్వజమెత్తారు. 30 ఎకరాల్లో గుట్ట తవ్వి మట్టి అమ్మిన పైసలు ఎటు పోయాయనీ, కాలేజీ పేరు చెప్పి అమ్ముకున్న మట్టికి వచ్చిన డబ్బెంత..?
అది ఎవరి చేతుల్లో ఉంది.? అనే విషయాలు మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గుట్ట మట్టి అంతా అమ్ముకున్న తరువాత ఖమ్మం నియోజకవర్గానికి కాలేజీ రావడం లేదని ప్రభుత్వం ప్రకటించడం బట్టి ఇదంతా ఒక పథకం ప్రకారమే మట్టి దోపిడీకి పాల్పడ్డట్టు అర్దమౌతోందని మహ్మద్ జావేద్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఏర్పాటు చేస్తాం అన్న ఇంజనీరింగ్ కాలేజీ పాలేరు నియోజకవర్గానికి ఎట్ల పోయిందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు.
మంత్రి సమాధానం చెప్పని ఎడల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన కమిటి అధ్యర్యంలో కాలేజీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. అవసరమైతే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు జేఎన్టీయూ కాలేజీ అనుమతులపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు.
ఖమ్మం జిల్లాకు జేఎన్టీయూ కాలేజీలు రెండా, ఒకటా..? ఒకటయితే గుట్ట మట్టిని తరలించిన దగ్గర ఎందుకు నిర్మాణం చేయడంలేదో వివరించాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, తెలంగాణ వనరులు మనకే వస్తాయని చెప్పి, తీరా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వనరుల దోపిడీకి తెరలేపిందని గుర్తుచేశారు.
నాడు కాంగ్రెస్ హయాంలో 27 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, తప్పుదు విధానాలతో నేడు కేవలం ఏడు కాలేజీలు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందన్నారు. రెండు రోజుల్లో మంత్రి పువ్వాడ సమాధానం ఇవ్వకుంటే ఆందోళనకు దిగేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.