వేతనాలు పెరగలేదని గోల చేసే టీచర్లను చూశాం. పిల్లలకు పాఠాలు చెప్పకుండా బలాదూర్ తిరిగే టీచర్లనూ చూశాం. రాజకీయ నాయకుల అండదండలతో ఒకే ఊళ్లో తిష్టవేసి ఉండే టీచర్లనూ చూశాం. అయితే బీహార్ కు చెందిన లలన్ కుమార్ లాంటి టీచర్ ను మాత్రం ఎవరూ చూసి ఉండరు.
ఇలాంటి ఆదర్శ టీచర్ల గురించి విని కూడా ఉండరు. 33 ఏళ్ల లలన్ కుమార్ ముజఫర్పూర్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో పని చేస్తున్నారు. దిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ, ఎంఫిల్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్పూర్లోని నితిశేశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు.
ఇది బీఆర్ అంబేడ్కర్ బిహార్ యూనివర్శిటీ (బీఆర్ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్ ఉద్యోగంలో చేరగా ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ రావడంతో కాలేజీ మూతబడింది. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
దీంతో లలన్ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్కు తిరిగిచ్చేశారు. ”ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా” అని లలన్ తెలిపారు.
నితిశేశ్వర్ కాలేజీలో దాదాపు 3వేల మంది విద్యార్థులు చదువుతుండగా ఇందులో 1100 మంది అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులున్నారు. లలన్ ఒక్కడే ఈ కాలేజీలో రెగ్యులర్ హిందీ టీచర్. అతడితో పాటు మరో గెస్ట్ లెక్చరర్ అప్పుడప్పుడు కళాశాలకు వస్తుంటారు.