భారత దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే జాతీయ బ్యాంకులను కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్. వెంకటాచలం ఆరోపించారు. బ్యాంకుల జాతీయీకరణ దేశంలోని సాధారణ పౌరులు సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడటానికి సహాయపడిందని, వ్యవసాయం, విద్య మరియు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల వంటి రంగాలకు బ్యాంకులు ప్రాధాన్యతా రంగ రుణాలు అందించడంలో కూడా జాతీయీకరణ సహాయపడిందని తెలిపారు.
ప్రజా సంక్షేమానికి మరియు ప్రజల ఆర్థిక సాధికారతకు సహాయపడుతున్న జాతీయ బ్యాంకులను నేడు నిరంకుశ మోడీ ద్వంసం చేస్తున్నాడని అయన మండిపడ్డారు. హైదరాబాద్ బాగ్ లింగం పల్లి, ఆర్టీసీ కళా భవన్ లో శనివారం యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 2 వ త్రై వార్షిక మహాసభలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ మహాసభలకు సిహెచ్. వెంకటాచలం ముఖ్యఅతిథిగా హాజరై తొలుత ఏఐబిఈఏ పతాకాన్ని ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ మహాసభల ప్రతినిధుల సభకు యూనియన్ ప్రధాన కార్యదర్శి సమద్ ఖాన్ స్వాగతం పలుకగా, అధ్యక్షులు టి. రవీంద్రనాథ్ అధ్యక్షత వహించగా మహాసభల ఆహ్వానా సంఘం చైర్మన్ బి.ఎస్.ఆర్.
మోహన్ రెడ్డి స్వాగతోపన్యాసం చేసారు. గౌరవ అతిథులుగా యూనియన్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ సురేష్ చంద్ర టెలి, ఏఐబిఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు, అఖిల భారత యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కిర్యదర్శి ఎన్. శంకర్, చైర్మన్ విన్ సెంట్ డిసౌజా, ఏపి యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి. ఉదయ కుమార్, యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ లు పి. సత్యం, సిఎస్. జనని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సిహెచ్. వెంకటాచలం మాట్లాడుతూ ఏఐబిఈఏ చరిత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు గొప్ప గర్వం మరియు స్ఫూర్తినిస్తుందని, ఎందుకంటే ఈ సంఘం లో సాధారణ మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగుల ప్రయాణం, వారి సంపూర్ణ ఐక్యత ద్వారా గౌరవం, భద్రత మరియు మెరుగైన జీవన పరిస్థితులను పొందవచ్చునని గుర్తు చేసారు.
ఆర్థిక సంస్థలలో దివాలా మరియు ఎన్.పి.ఏ ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని అయన తెలిపారు. ప్రధాని మోడీ సామాన్య ప్రజల సంక్షేమానికి కట్టుబడి లేడని, కేవలం తన కొంతమంది కార్పొరేట్ మిత్రుల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నాడని అయన విమర్శించారు. లాభదాయక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల వెన్నెముక మోడీ పాలన ద్వారా క్రమపద్ధతిలో విచ్ఛిన్నమైందని అన్నారు. ప్రధాని మోడీ తిరోగమన విధానాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు అనేక సవాళ్ళను ఎదురుకుంటున్నారని అందులో ఉద్యోగ భద్రత ఒకటని తెలిపారు.
బ్యాంకులు, బీమా మరియు బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించవలసిన అవసరముందని అయన పేర్కొన్నారు. జనవరి 31న యూనియన్లతో సమావేశం నిర్వహించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించిందని, జనవరి 30-31 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను వాయిదా వేసినట్లు అయన తెలిపారు.
ఐదు రోజుల బ్యాంకింగ్, పెన్షన్ అప్డేట్, అవశేష సమస్యలు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పిఎస్) రద్దు చేయడం, వేతన సవరణ కోసం డిమాండ్ల చార్టర్పై ఐబిఏ తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చర్చలు జరుపుతుందని సిహెచ్. వెంకటాచలం వెల్లడించారు.