40.2 C
Hyderabad
May 5, 2024 17: 54 PM
Slider ప్రత్యేకం

గుడ్ వర్డ్: వర్ణించలేని మహాకావ్యం ‘అమ్మ’

#Mother's Day

అమ్మ ప్రేమ పొందడం అందరికీ అనుభవమే. అయితే, అమ్మ ప్రేమను వర్ణించమంటే? అది సాధ్యమయ్యేపని కాదు. వ్యాసానికి, ఉపన్యాసానికి, కవితలకు, కథలకు  అందని సృష్టి అమ్మ. ఏ  మహాకవియైనా ప్రేయసి అందాన్ని వర్ణించగలడు. పాలించే రాజులోని వీరత్వాన్ని, దాన గుణాన్ని వచించగలడు.

కనిపించని దైవాన్నికూడా  కవితామయం చేసి స్తుతించగలడు. నవరసాలకు అక్షరాకృతి ఇవ్వగలడు. అమ్మని వర్ణించడానికి ఏ మహాకవి దగ్గర ఉన్న కవితా సంపద సరిపోదు. ఏ చిత్రకారుడి, ఏ శిల్పకారుడి కళా ప్రతిభలు సరిజాలవు. అమ్మతనాన్ని తూకం వేసే రాళ్లు సృష్టిలో లేనేలేవు.

ఆమె పట్ల కృతజ్ఞత, ఆమె పెంచిన, పంచిన జ్ఞాపకాల మధురత, ఆమె అందించిన సేవల, చిలికించిన ప్రేమ, పంచిఇచ్చిన సంస్కార సంపదల, త్యాగనిరతుల స్మృతిలో తరించడం, హృదయం పరచి కన్నీళ్లు, ఆనందభాష్పాలు ఏకం చేసి నిలువెత్తు కృతజ్ఞతతో నమస్సులు సమర్పించడమే మనం చేయగలిగింది. చేయవలసింది కూడా.

తల్లిని మించిన దైవం లేదు

కొండంత దేవునికి కొండంత పత్రి సమర్పించలేం కదా ! అని,  పూజించడం మానం కదా. దొరికిన ఒక పువ్వుతోనైనా, ఒక పత్రంతోనైనా పూజలు చేస్తాం. అలాగే, అక్షరాలు దొరకలేదని  అమ్మను అర్చించకుండా ఉంటామా?  “న మాతుః పరం దైవతమ్” అన్నది ఆర్యోక్తి. తల్లిని మించిన దైవం లేదన్నది దాని సారాంశం.

ఆదిశంకరాచార్యుడి నుండి ఆధునిక సినిమా కవి వరకూ అమ్మను అక్షరాల్లో బొమ్మకట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకప్పటి చందమామ పుస్తకంలో,అమ్మగురించి చెప్పిన ఒక కథ ఈ సందర్భంలో గుర్తుచేసుకుందాం. ” మీ తల్లి గుండె నాకు కావాలి. అది తీసుకొచ్చి ఇవ్వమని భార్య భర్తను కోరింది.

భార్య వ్యామోహంలోఉన్న అతను తల్లి గుండెను కోసి, తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో,అతనికి  ఒక రాయి తగులుతుంది …  అమ్మా! అని అరుస్తాడు. ఏం నాయనా దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? జాగ్రత్తగా వెళ్ళు అంటుంది ఆ అమ్మ గుండె”. అదీ అమ్మతనం! తన గుండెను కోసి తీసికెళ్తున్నా, కొడుకు క్షేమం గురించే  ఆలోచించేది అమ్మ.

చెడ్డ కుమారుడు ఉండచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు

ఈ కథ చెప్పే నీతి అది. అందుకే, ఆదిశంకరాచార్యులు “కు పుత్రో జాయేత క్వచిదపి కు మాతా న భవతి ” అంటాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా చెడ్డకుమారుడు ఉంటాడేమో! కానీ, చెడ్డతల్లి ఎక్కడా ఉండదు, అని దాని తాత్పర్యం. ఈ వాక్యం మనమందరం పటం కట్టించుకొని గుండెల్లో పెట్టుకోవాలి. తల్లి పట్ల మనం ఎంత మంచిగా ఉంటున్నాం, ఎంత చెడ్డగా ఉంటున్నాం, అని నిరంతరం మనల్ని మనం ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉండాలి.

అసలు మనలో చాలామంది తల్లి దండ్రులను  ఇంట్లోనే ఉంచుకోవడం లేదు. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, డొక్కలు ఎండపెట్టుకొని పిల్లలను పెంచుతారు. పిల్లలకు రెక్కలు రాగానే తల్లిని వదిలిపెట్టి వెళ్లేవారు  కొందరు, వృద్ధాశ్రమాల్లో చేరుస్తూ మరికొందరు, కొంతమంది సేవకులను అప్పజెప్పి, వేరే ఇళ్లల్లో  ఉంచేవారు ఇంకొందరు ప్రబుద్ధులు తయారవుతున్న  నవీన నాగరిక సమాజంలో నేడు ఉన్నాం.

తల్లిని ఏడిపిస్తున్న కొడుకులు

తల్లి పనికిరాని వస్తువయ్యింది. పిల్లలకు బరువయ్యింది. ఆ తల్లిని వదిలించుకొనే, దించుకొనే ప్రయత్నంలోనే నేటికాలపు పిల్లలు సాగుతున్నారు. అందుకే,  “ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు –  పెట్టబోక ఏడిపించు నేడు” అన్నారు గరికిపాటి నరసింహారావు ఒక పద్యంలో.

చిన్నప్పుడు అన్నం తినకుండా మారాం చేస్తున్న పిల్లవాడిని, వెంటపడి అన్నం పెడుతుంది, అయ్యో! వీడు అన్నం తినడం లేదే? అని బాధపడుతుంది అమ్మ. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, ఆ అమ్మకే అన్నంపెట్టకుండా,  ఏడిపిస్తాడు అదే  కొడుకు. చిన్నప్పుడూ, పెరిగి పెద్దయినప్పుడూ అమ్మకు కన్నీళ్లే మిగిలిస్తున్నాం.

అత్తలో తల్లిని చూడలేని కోడళ్లు

అత్తా ఒకప్పుడు కోడలే అన్న చందంగా, కూతురు లేదా కోడలు జీవితంలో ఏదో ఒకనాడు తల్లిపాత్ర పోషించాల్సిందే. తన పిల్లలకు తల్లితనం పంచాల్సిందే. పంచుతుంది కూడా. కానీ! ఈ క్రమంలో,  అత్తగారిలోని తల్లి ఈమెకు గుర్తురాదు. అదే మాయ. భార్య మాయలోనో, భయంతోనో, అవసరంతోనో కొడుకు తల్లిని మరచిపోతున్నాడు.

అదీ నేటి విషాదం. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండవ ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా మాతృదేవతా దినోత్సవం జరుపుకోవడం కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అది ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, ఎప్పుడు మొదలు పెట్టారు అనే చరిత్ర గురించి పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు.

వారు మొదలు పెట్టిన సంప్రదాయాన్ని మనం కూడా గౌరవిద్దాం. అమ్మను తలచుకుందాం. అమ్మను కొలుచుకుందాం.”అమృతానికి, అర్పణకు అసలుపేరు అమ్మ – ఈ లోకమనే గుడి చేరగ, తొలివాకిలి అమ్మ” అన్నారు మాడుగుల నాగఫణిశర్మ.

అమృతం తొణికించే అమ్మప్రేమ

అమృతం ఎలా ఉంటుందో, మనకెవ్వరికీ తెలీదు. అది అనిర్వచనీయం. త్యాగం, ప్రేమ,సేవల అర్పణకు అసలు పేరు అమ్మ . ఆ తల్లి ఋణం మనం తీర్చుకోలేం. అంత ప్రేమ మనం తిరిగి ఆమెకు పంచలేం. మరణించినప్పుడు   తద్దినాలు (పితృకార్యాలు)పెట్టడం , పెద్ద పెద్ద ఉత్సవాలు చెయ్యడం మాత్రమే కాదు.

తల్లి బతికున్నప్పుడు ఆమెను ఎంత గౌరవించాం, ఎంత ప్రేమించాం, ఎంత సేవించాం అన్నది, అన్నింటికన్నా ముఖ్యం. కొడుకు, కోడలు, కూతురు అందరూ అమ్మతనం పట్ల స్పృహగా ఉండాలి. గౌరవంగా మెలగాలి. కొన్ని రాష్ట్రాల్లో సంతానానికి తల్లిపేరు కూడా  కలిపి పెడతారు.

ఒక్క రోజు ప్రేమ కాదు

ఈ మధ్య కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తి నుండి సమాచారం సేకరించే క్రమంలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా చేర్చారు. వీలైనంత వరకూ తల్లిదండ్రులను మనతోనే ఉంచుకుందాం. పిల్లల పట్ల ఎంత ప్రేమ, శ్రద్ద చూపిస్తామో? తల్లిదండ్రుల పట్లా అంతే ప్రేమ చూపిద్దాం.

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తలచుకొనే పండగ కాదు అమ్మ.., ప్రతినిత్యం గుండెల్లో కొలవాల్సిన బొమ్మ… అమ్మ. మహాభారతంలోని  యక్షప్రశ్నల్లో యమధర్మరాజు  వేసిన  ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలు  చూద్దాం: ఆకాశం కంటే ఎత్తైనవాడు?  = తండ్రి, భూమి కంటే గొప్పది?  = తల్లి. క్షమయా ధరిత్రి, అన్నది ఆర్యోక్తి.

సహనానికి మారుపేరు భూమి, అన్నది  దాని తాత్పర్యం. ఆ  భూమి కంటే కూడా  మించిన సహనం కల్గింది అమ్మ. అందుకే, భూమికంటే కూడా గొప్పది అమ్మ. అదీ  ధర్మరాజు చెప్పిన సమాధానం. ఇంత గొప్పతనం మూర్తీభవించిన అమ్మకు వందనం సమర్పిద్దాం. అమ్మతనానికి జేజేలు పలుకుదాం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే మేనిఫెస్టో

Bhavani

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష మంది తో కార్మిక మహాగర్జన

Bhavani

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు పార్కులు

Satyam NEWS

Leave a Comment