విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దిక్కులు పెక్కిటిల్లేలా నినాదాలతో 32 మంది బలిదానాలతో సాధించుకుంటే ఇవాళ కార్పొరేట్లకి అప్పనంగా ధారాదత్తం చేయాలనుకోవడం చాలా సిగ్గు చేటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ వ్యతిరేకిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ విజయనగరం జిల్లా సమితులు ఆధ్వర్యంలో రాష్ర్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాలో మాట్లాడుతూ బీజేపీ ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోవాలని, ప్రభుత్వ రంగాలను కాపాడుకోవాలని, ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమ తెలుగు ప్రజల భావద్వేగాలతో, బలిదానాలతో,
నిర్మితమైన ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మన్నికైనా, నాణ్యమైన ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే నిలబెట్టుకోవడానికి రెండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ కార్మికులు, నిర్వాసితులు, రాష్ట్రంలో సీపీఐ, ఏఐటీయూసీ వామపక్ష కార్మిక, ప్రజాసంఘాలు, అన్ని తరగతులు విభాగాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నా కేంద్ర, ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విశాఖ ఉక్కును ప్రైవేటికరణ కాకుండా ప్రభుత్వంలోనే నడపాలని అన్నారు.
ఏకపక్ష నియంతృత్వ పొగడకు, కార్పొరేట్ కంపెనీలైన పోస్కో, అదానీ, అంబానీలకు లాభాలు చేకూర్చడానికి ప్రజల ఆస్తులను తెగనమ్మే చర్యలకు చరమగీతం పాడటానికి ఈ నెల 30వ న విశాఖలో లక్షల మందితో “కార్మిక మహా గర్జన” జరగనున్నదని తెలిపారు. ఈ ఉద్యమానికి బాసటగా నిలిచి బీజేపీ ప్రభుత్వం పై రణభేరి మోగించడానికి జరుగుతున్న కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువజన, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున కదలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్. రంగరాజు, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుగత పావని,
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్ళ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్రవంతి, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పురం అప్పారావు, కె.వి.రమణ, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ. రాములు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు పొందూరు అప్పలరాజు, అప్పురుబోతు జగన్నాధం, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. లక్ష్మీ, అనిషా, సీపీఐ నగర నాయకులు వడ్డాది కొండలరావు, బోనెల అప్పలనర్సయ్య, కాంచెర్ల లక్ష్మణ , పార్టీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.