ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు పోలీసుల జీవితాలతో కబడీ ఆట ఆడుకుంటున్నది. ఈ ఆధిపత్య పోరులో ఎంతో మంది పోలీసులు నలిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీ కృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య జరిగి ఈ వికృత క్రీడలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పక్షం వహించారు.
ఎమ్మెల్యే కు అనుకూలంగా పని చేసి, ఆయన చెప్పినట్లు తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ అయిన వినుకొండ రూరల్ సీఐ ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నిజనిర్ధారణ నివేదికతో తానే సస్పెండ్ చేసిన సీఐని ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకున్నారని తెలిసింది.
వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, రైతు అయిన నరేంద్ర తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పంట బకాయిల కోసం ఎంపి లావు శ్రీ కృష్ణదేవరాయలును ఆశ్రయించారు. ఆయన రైతుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పంట బకాయిలను విడుదల చేయించారు.
ఇది నచ్చని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సొంత పార్టీ నాయకుడైన ఆ రైతును చెప్పు తీసుకుని కొట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చెప్పు తీసుకుని కొట్టడమే కాకుండా ఆ రైతు పై వినుకొండ ఎమ్మెల్యే తప్పు కేసు పెట్టించారు.
ఆ రైతు తన పిఏ పై దాడి చేశారని చెబుతు హత్యా యత్నం కేసు పెట్టించారు. ఇదంతా తప్పని కేసును పూర్తిగా పరిశీలించి న్యాయం చేయాలని ఎంపి లావు శ్రీ కృష్ణదేవరాయలు ఎస్ పికి ఫిర్యాదు చేయగా ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
ఆ తర్వాత డిఐజికి, డీజీపీకి విడతల వారీగా ఫిర్యాదు చేయగా డీజీపీ విచారణకు ఆదేశించారు. విచారణలో అది తప్పుడు కేసని తేలింది. దాంతో ఎమ్మెల్యే ఆదేశాలతో తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ ని సస్పెండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంపి లావు శ్రీ కృష్ణదేవరాయలు పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యలకు ఆయన పాల్పడుతున్నారని, తన నియోజకవర్గంలోకి వచ్చి పెత్తనం చేస్తున్నారని ముఖ్యమంత్రికి చెప్పారు. రైతుపై హత్య కేసు పెట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్న సమయంలో అదే విషయాన్ని ఎంపి ఎత్తి చూపుతున్నారని దీనివల్ల ప్రతిపక్షాలది పై చేయి అవుతున్నదని బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్లారు. దాంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎంపి లావు శ్రీ కృష్ణదేవరాయలు ఏం చేస్తారో చూడాలి.