దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి శరవేగంగా రాకపోకలు సాగించే అవకాశం త్వరలోనే రానుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.
అదే నెల 18న టెండర్లు కూడా పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్నర గంటల్లో చేరుకునే వెలుసుబాటు వస్తుంది. దీంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది.
ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నిర్మిస్తారు. ఈనేపథ్యంలో జిల్లా పరిధిలోని తాండూరు, పెద్దేముల్, ధరూర్, వికారాబాద్, నవాబ్పేట్ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేపట్టనున్నారు. కాగా, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు లైన్ ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్ పనులు ప్రారంభమయ్యాయి.