పైడితల్లి అమ్మవారి పండగలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు
విజయనగరం సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, కళారంగ విశిష్టతలను ప్రతిబింబించేలా విజయనగరం ఉత్సవాలను నిర్వహిద్దామని దానికి గాను అన్ని విభాగాల అధికారులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు అమ్మవారి జాతరను సంతృప్తికర స్థాయిలో జరిపించుకోలేకపోయామని కావున ఈ ఏడాది అన్ని రకాల ప్రదర్శనలకు, కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ అంగరంగ వైభవంగా పైడితల్లి జాతరను చేసుకుందామని పిలుపునిచ్చారు.
అమ్మవారి పండగలో భాగంగా అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు విజయనగరం ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని, తగిన చర్యలు ప్రారంభించాలని స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశంలో పేర్కొన్నారు.
ఉత్సవాల నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలపై మార్గనిర్దేశకాలు జారీ చేశారు. ఏయే విభాగం ఏయే కార్యక్రమాలు చేపట్టాలో దిశానిర్దేశం చేశారు.జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిలతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ పలు అంశాలపై సూచనలు చేశారు.
అమ్మవారి జాతర, విజయనగరం ఉత్సవాలు విజయవంతం కావాడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. పైడితల్లి అమ్మవారి పండగ ప్రారంభం రోజున అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అమ్మవారి ఆలయం నుంచి ఆనందగజపతి ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది.
ర్యాలీలో భాగంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జడ్పీ ఛైర్మన్ సూచించారు. ర్యాలీగా వెళ్లిన వారంతా ఆనందగజపతి ఆడిటోరియం మీదుగా సాగాలని, అనంతరం ఆడిటోరియంలో ఉత్సవాల ప్రారంభ సూచకంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అతిరథ మహారథుల ప్రసంగాలతో, సంప్రదాయ కార్యక్రమాలతో అటు అమ్మవారి పండగ, ఇటు విజయనగరం ఉత్సవాలు ప్రారంభమవుతాయని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు.