వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ లో తక్కువ అద్దె చెల్లిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ ముస్లింలు చేస్తున్న ఆందోళన నాలుగో రోజుకు చేరింది. నాలుగు రోజులుగా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ముస్లిమ్ లు నేడు ర్యాలీ నిర్వహించారు.
ఉస్మానియా మసీదు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా మసీద్ వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న లీజుదారులు రాజ్యాంగం, చట్టం, అగ్రిమెంట్స్ ఇవేమీ పట్టనట్టుగా చేస్తూ తాము నిర్ణయించిన అద్దెలు మాత్రమే తీసుకోవాలని వత్తిడి తీసుకువస్తున్నారని వారన్నారు.
దీనివల్ల మసీదుకి రావాల్సిన ఆదాయానికి భారీస్థాయిలో గండిపడుతుందని ముస్లిం సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గడువు ముగిసిన లీజుదారులు గత 12 నెలల క్రితం మసీదు కమిటీ వారు పెంచిన అద్దెను చెల్లించకుండా ఉండటం వలన సిబ్బందికి మసీదు అభివృద్ధికి సిబ్బంది జీతభత్యాలకు ఇబ్బందులు ఎదుర్కొ వలసిన పరిస్థితి దాపురించిందని, సంబంధిత వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వలన గడువు ముగిసినా సమస్యను పట్టించుకోవటం లేదని స్థానిక ముస్లిం సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే సంబంధిత వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించి ఉస్మానియా మసీదు వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ బహిరంగ వేలం ద్వారా అర్హులైన ముస్లిం సోదరులకు కేటాయించి మసీదు ఆదాయాన్ని పెంచి అభివృద్ధికి తోడ్పడాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి.అజీజ్ పాషా,ఎంఏ అబ్దుల్ రహీమ్, సయ్యద్ మున్న,షేక్.మన్సూర్అలీ,పఠాన్ గౌస్ ఖాన్,ఎండి.రహీం,బిక్కన్ సాహెబ్, సలావుద్దీన్, సిరాజ్, జానీ, మౌలాలి,,ఖాదర్,సద్దాం,గౌస్,ఖజా, ముస్తఫా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్