విజయనగరం పోలీస్ శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టిన పోలీస్ బాస్…!
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఒకే పోలీసు స్టేషనులో గడచిన ఐదేళ్లుగా పని చేస్తున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ ఎం. దీపిక కౌన్సిలింగు నిర్వహించి, బదిలీలు చేపట్టారు. జిల్లా పోలీసుశాఖలో ఒకే పోలీసు స్టేషనులో గడచిన ఐదేళ్లు పని చేస్తున్న 11మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 25మంది కానిస్టేబుళ్ళు, మహిళా కానిస్టేబుళ్ళును కౌన్సిలింగు ప్రక్రియకు హాజరుకావాల్సిందిగా ఇటీవలే ఎస్పీ దీపిక ఉత్తర్వులు జారీ చేసారు.
ఈ నేపధ్యంలో డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కౌన్సిలింగు ప్రక్రియలో వివిధ పోలీసు స్టేషనుల్లోగల ఖాళీలను స్క్రీన్ పై ప్రదర్శించి, వారి నుండి ఆప్షన్స్ తో కూడిన దరఖాస్తులను స్వీకరించి, బదిలీలు చేపట్టారు. ఎటువంటి సిఫార్సులకు తావు లేకుండా, కౌన్సిలింగు నిర్వహించి, పారదర్శకంగా బదిలీలను చేపట్టడంతో పోలీసు సిబ్బంది తమ సంతృప్తిని వ్యక్తం చేసారు.
ఈ బదిలీలలో ఉద్యోగాలు చేస్తున్న భార్య, భర్తలకు కూడా జిల్లా ఎస్పీ దీపిక ప్రాధాన్యత కల్పించారు. ఈ బదిలీల ప్రక్రియలో పోలీసు కార్యాలయ పర్యవేక్షకులు ప్రభాకరరావు, ఎస్బీ సిఐలు జి.రాంబాబు, సి.హెచ్. రుద్రశేఖర్, జూనియర్ సహాయకులు చాముండేశ్వరి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.