రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయనగరం జిల్లా కు వచ్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. జిల్లా లోని బొబ్బిలి లో కొత్త గా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కోటి 40 లక్షల రూపాయిల వ్యయంతో పోలీసు స్టేషను నూతన భవనాన్ని నిర్మించి, ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒక శుభపరిణామం అని అన్నారు. జిల్లాలో మరో 3 పోలీసు స్టేషన్ భవనాలు సాలూరు, కురుపాం, చినమేరంగిలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీసు భవనాల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతున్నదన్నారు.
జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ మంచి కార్పొరేట్ ఆఫీసు వలే పోలీసు స్టేషను భవన నిర్మాణం చేపట్టినందుకు ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. పని చేసే ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండడంతో పోలీసుల పని తీరు కూడా మారుతుందన్నారు. ప్రజలు నిర్భయంగా న్యాయం కోసం పోలీసు స్టేషనుకు రావచ్చునని, వారి సమస్య తెలుసుకొని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పి. రఘువర్మ, ఎమ్మెల్యే ఎస్.వి. సిహెచ్.అప్పల నాయుడు, జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్, జేసీ మహేష్, ఐఎఎస్, ఐటిడిఎ పిఓ కూర్మనాథ్, అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ, ఓఎస్డీ ఎన్.సూర్యచంద్ర రావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.