ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఇటీవల చిరుతలను విడుదల చేసిన విషయం తెలిసిందే. నమీబియా నుంచి విమానాల ద్వారా ఆ చిరుతలను తీసుకువచ్చారు. భారతదేశంలో అంతరించిపోయిన చిరుత జాతిని తిరిగి పెంచేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నారు. నేడు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చిరుతల విషయాన్ని ప్రస్తావించడం ఆసక్తి కలిగిస్తున్నది.
చిరుతలను చూసే అవకాశం ఎప్పుడు లభిస్తుందని చాలా మంది తనను అడిగారని ఆయన అన్నారు. చిరుతల కోసం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి వాతావరణంలో చిరుతలు ఎంతవరకు మనుగడ సాగిస్తాయో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. అప్పుడే సాధారణ ప్రజలకు చిరుతలను చూసే అవకాశం కల్పించేందుకు వీలుకలుగుతుందని ప్రధాని వెల్లడించారు.
ఈ సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘‘నేను మీ అందరికీ కొంత పనిని అప్పగిస్తున్నాను, దీని కోసం, MYGOV వేదికపై ఒక పోటీ నిర్వహించబడుతుంది, దీనిలో కొన్ని విషయాలను పంచుకోవాలని ప్రజలను కోరుతున్నాను. చిరుతల గురించి మనం చేస్తున్న ప్రచారానికి ఏ పేరు పెట్టాలి అనే విషయం మీరు సూచించండి’’ అని ప్రధాని ప్రజలను అడిగారు.
ఈ నామకరణం సంప్రదాయబద్ధంగా ఉంటే చాలా బాగుంటుందని ఆయన అన్నారు. ఎందుకంటే, మన సమాజం మరియు సంస్కృతి, సంప్రదాయం మరియు వారసత్వానికి సంబంధించిన ఏదైనా మనల్ని సులభంగా ఆకర్షిస్తుంది అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చిరుతలకు పేర్లు పెట్టడంపై కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ చిరుతలను ఒక్కొక్కటి ఏ పేరుతో పిలవాలని మనం ఆలోచిస్తే మంచిది అని ఆయన అన్నారు.
ఈ పోటీలో పాల్గొన్న వారికి చిరుతలను చూసే మొదటి అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ పోటీలో తప్పక పాల్గొనాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రధాని వెల్లడించారు.