కళలకు కాణిచి, విద్యలనగరమైన విజయనగరం జిల్లా ఆ పేరును మరోసారి ఖరారు చేసుకుంది. జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్ధి బొబ్బిలి రమేష్ జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధి రమేష్ వర్చ్యువల్ విధానంలో ఈ నెల 4న జరిగిన జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రెసిడెంట్ అవార్డుకు ఎంపికయ్యాడు.ఈ మేరకు విద్యార్ధి బొబ్బిలి రమేష్ను జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి అభినందించారు.
జిల్లాలోని విద్యార్ధులకు బొబ్బిలి రమేష్ స్ఫూర్తిగా నిలుస్తున్నాడని పేర్కొంటూ భవిష్యత్తులో తన ప్రతిభ, మేథోశక్తితో మరిన్ని పురస్కారాలు పొందాలని కలెక్టర్ ఆకాక్షించారు. ఆ విద్యార్ధికి ప్రాజెక్టు రూపకల్పనలో తోడ్పాటు అందించి సహకరించిన ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులను కూడా కలెక్టర్ అభినందించారు.
కాగా స్వచ్ఛభారత్ నిర్మాణంలో గణితం యొక్క సహాకారం అనే అంశంపై ఈ విద్యార్ధి రూపొందించిన ప్రాజెక్టు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ ఖర్చుతో మరుగుదొడ్డి నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం అనే అంశంపై ప్రాజెక్టు తయారుచేసి వర్చ్యువల్ విధానంలో ప్రదర్శించారు.
జాతీయ స్థాయిలో 581 మంది విద్యార్ధులు ఈ వర్చ్యువల్ ప్రదర్శనలో తమ ప్రాజెక్టులు ప్రదర్శించగా జిల్లా నుంచి బొబ్బిలి రమేష్ ఎంపికైనట్లు డి.ఇ.ఓ. వివరించారు. ఈ విద్యార్ధికి గైడ్లుగా బుడతనాపల్లి జెడ్.పి.హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయులు ఆర్.సత్యారావు, కె.భాస్కరరావు, జిల్లా సైన్స్ అధికారి బల్లా శ్రీనివాసరావు వ్యవహరించారని పేర్కొన్నారు.