హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ తరహాలో మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై నెక్లెస్ రోడ్ ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు ధన్యవాదాలు తెలిపారు. కోరిన తక్షణమే 24 కోట్ల52 లక్షల రూపాయలు కేటాయిస్తూ గురువారం జీవో ఆర్ టి నెంబర్ 64 ను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మాదిరిగా మహబూబ్ నగర్ కు కూడా నెక్లెస్ రోడ్డును తీసుకువస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 22న నిర్వహించిన మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో చెప్పిన 3 రోజులకే జీవో విడుదల కావడం హర్షణీయం. తొందరలోనే నెక్లెస్ రోడ్ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నిధులతో ప్రస్తుత ట్యాంకుబండు పెంపు, విస్తరణ, పెద్ద చెరువు పూడిక తీత,నీటి శుద్ధి వంటి పనులను చేపడతామని, అంతేకాక 2.4 కిలోమీటర్ల మేర ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్,ఫూట్ పాత్,ఏర్పాటు చేయటం జరుగుతుందని, సుమారు 5,6 కిలోమీటర్ల మేర వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.దీనివల్ల పెద్ద ఎత్తున పర్యాటకులు, ఉదయపు, సాయంత్రపు నడకకు వచ్చే వారు ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు ఏర్పాటు చేయడం మహబూబ్ నగర్ కు మరో మణిహారమని మంత్రి వెల్లడించారు.