ఏపీ రాష్ట్రంలో కొత్తజిల్లాల ఏర్పాటులో భాగంగా సీఎం జగన్…వెలగపూడి నుంచీ కొత్త జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు స్థానికప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రజలకు మంచి జరగాలని, మరింత మంచి పాలన అందాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని సీఎం స్పష్టం చేశారు. వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత సులభంగా ప్రభుత్వ సేవలు అందుతాయని పేర్కొన్నారు.
అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విభజించామని, పేర్లు పెట్టామని తెలిపారు. సగటున 19 లక్షల మందికి ఒక జిల్లా ఉండేలా పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అవినీతి లేని పూర్తి పారదర్శకతతో కూడిన వ్యవస్థను రూపొందించేందుకు రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు.
రైతులకు, సామాన్య ప్రజలకు అన్ని వేళలా అధికార యంత్రాంగం అండగా ఉండేందుకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో అన్ని కార్యాలయాలూ ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా స్థలాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలో ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో ఇంటరాక్ట్ అయ్యారు.
సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఎస్.డి.జి. లక్ష్యాలను చేరుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రణాళికాయుతంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకోవాలని నిర్దేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయనగరం కలెక్టరేట్ వీసీ హాలు నుంచి మంత్రితో పాటు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎస్పీ ఎం. దీపిక, గజపతినగరం, ఎస్. కోట, రాజాం ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, ఎమ్మెల్సీ సురేశ్ బాబు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో ఎం. గణపతిరావు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.