పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని సోమవార్ పేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిష్ట ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని విద్యార్థులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తేనే వృత్తికి న్యాయం చేసిన వారవుతారని తెలిపారు. ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణలు అవసరమని, వీటి వల్ల వారు సమర్థవంతంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారని తెలిపారు.
ఎన్ సి ఈ ఆర్ టి ద్వారా నిర్వహించబడుతున్న ఈ శిక్షణ ద్వారా వివిధ బోధనాంశాలలో అనుసరించవలసిన వ్యూహాలతో పాటు, పాఠ్యాంశాలను సమర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక విలువలు నేర్పటంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించారు. రానున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఈసారి మరింత ఫలితాలను అందించాలని సూచించారు.
స్థాయి తక్కువగా ఉన్న విద్యార్థులు పరీక్షలు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చూడాలని, ఎందుకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల సహాయ సహకారాలను పొందేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి టీ ప్రణీత, డిసిఇబి కార్యదర్శి రఘురాజ్, సెక్టోరల్ అధికారులు రమణారెడ్డి, పద్మ, రిసోర్స్ పర్సన్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.