రాష్ట్రంలో మద్యం ధరల పెంపు వెనుక మాఫియా హస్తం ఉందని మల్కాజ్ గిరి ఎంపి ఏ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్(KST) అమలవుతోందని అందుకోసమే మద్యం రేట్లు పెంచారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేనని ఆయన అన్నారు. మద్యం ధరల పెంపు వెనుక KST మాఫియా ఉందని, మద్యం ధరల వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చాడ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మద్యం ధరల పెంపు భారీ కుంభకోణమని ఆయన తెలిపారు.
అందుకోసమే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ… ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని, మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతలో రాజీ పడటమేనని రేవంత్ అన్నారు. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో కూడా మద్యం ఆదాయం ఇంత లేదు, ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్- అందుకే KST కూడా ఆరు శాతమే పెట్టారని రేవంత్ వ్యంగ్యంగా అన్నారు.
కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారని, ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యి శాతం అధిక ధరలు ఫిక్స్ చేసింది దోచుకోవడానికేనని ఆయన అన్నారు. ఈ మద్యం కుంభకోణంపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.