వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నీటిని విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని కెనాల్ హెడ్ రెగ్యులేటరీ నుండి నేడు స్విచ్ ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, NDCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్, మాజీ ZP చైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.13 TMC ల నీరు నిల్వ ఉన్నదని ఆయన అన్నారు. ఈ వానాకాలంలో నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన తెలిపారు.
జుక్కల్, బాన్సువాడ, బోదన్ నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు ఉన్నది. ఇప్పటికే రైతులు బోర్లు, బావుల క్రింద వరి నారు మళ్ళు పోసుకున్నారు. కాలువల ద్వారా వదిలిన నీరు నాట్లకు ఉపయోగపడుతుందని స్పీకర్ తెలిపారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల అవుతుందని, మొదటి విడతలో నీటిని 20 రోజులు వదులుతామని ఆయన అన్నారు.
వానాకాలం సాగుకు 9 TMC లు అవసరం అవుతుందని అందువల్ల నీటిని ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అత్యవసరమైతే ముఖ్యమంత్రి తో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చుకుంటామని ఆయన తెలిపారు.