డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని టిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసి మహిళలను మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రీమియం డబ్బులు చెల్లించిన వారికి అభయహస్తం పెన్షన్ ఇవ్వలేనందున తిరిగి డబ్బులు వాపసు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఏడాదిన్నర గడిచిందన్నారు.
2014 వరకు మహిళలు చెల్లించిన అభయాస్తం ప్రిమీయం డబ్బులు రూ.1500 కోట్లు ఏం చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రి, సువర్ణపురం, న్యూ లక్ష్మీపురం, ఖానాపురం గ్రామాల్లో విజయవంతంగా కొనసాగింది. ఈ క్రమంలో మహిళలు, రైతులు, నిరుద్యోగులు తమ సమస్యలను సీఎల్పీ నేత కు విన్నవించారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి అభయ హస్తం పథకాన్ని తీసుకురావడంతో 23, 38, 014 మంది మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి 365 చెల్లిస్తే అంతే మొత్తంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందన్నారు.
తెలంగాణ ఏర్పాటు నాటికి 2.20 లక్షల మందికి అభయ హస్తం పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ స్కీమ్ పెట్టీ 1,33, 415 మంది అభయ హస్తం సభ్యులను ఆసరా పరిధిలోకి మార్చారన్నారు. మిగతా 86 585 మందికి 2016 అక్టోబర్ నుంచి అభయహస్తం పెన్షన్ నిలిచిపోయిందని వివరించారు. ఐదున్నర ఏళ్లుగా అభయహస్తం పెన్షన్ దారులకు ఎలాంటి పెన్షన్ రాక దీన స్థితిలో ఉన్నప్పటికి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
గత నాలుగు సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకాన్ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా అటకెక్కించడం వల్ల సమ భావన సంఘాల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వీరి సమస్యల సాధన కోసమే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఎన్నికల హామీలు ఒకటైన అమలు చేశారా?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటైన అమలు చేశారా? ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ? లక్షల ఎకరాలకు సాగునీరు ? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ? కేజీ టు పీజీ ఉచిత విద్య ? ఇంటికో ఉద్యోగం ? దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ? వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బంగారు తెలంగాణ ఎలా అయ్యింది అని” సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.