ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు విఫలం: యుద్ధం కొనసాగింపు ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. సుమారు 4 గంటల పాటు బెలారస్లో జరిగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు.
యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. నాటోలో చేరం అని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబట్టింది. ఇరు దేశాలూ పట్టు వీడకపోవడంతో చర్చలు విఫలం అయ్యాయి.
శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కూడిన ఆరుగురు సభ్యులు బృందంతో రష్యాకు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఒకవైపు శాంతి చర్చలంటూనే ఉక్రెయిన్లో రెండో అతి పెద్ద నగరమైన ఖార్కీవ్లో రష్యా మారణహోమం సృష్టించింది.
తాజా చర్చల సారాంశాన్ని ఇరు దేశాలు అధినేతలకు రెండు దేశాల ప్రతినిధులు నివేదించిన తర్వాత రెండో దశ చర్చలు తిరిగి జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రష్యాను ఎదుర్కొనేందుకు పోరాటంలో అనుభవమున్న దోషులను కూడా జైళ్ల నుండి విడుదల చేస్తామని వెల్లడించారు.
నైతిక కోణం నుండి ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులవైన పని కాదని, కానీ తమ రక్షణ కోసం ఇటువంటి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా తమ దేశానికి మద్దతు తెలుపుతున్న పశ్చిమ దేశాలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధ్యక్షుడు మైఖెల్ బ్యాచ్లెట్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 102 మంది చనిపోగా ఏడుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. తక్షణమే తన దేశానికి సభ్యత్వం కల్పించాలని యూరోపియన్యూనియన్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమర్ జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.
నూతన ప్రత్యేక విధానం ద్వారా తక్షణమే మా దేశాన్ని చేర్చుకోండి’ అంటూ యూరోపియన్ యూనియన్ను వేడుకున్నారు. తమ లక్ష్యం యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండటమేనని, ముఖ్యంగా సమాన హోదాలో ఉండటమని ఆయన తెలిపారు.
ఇది న్యాయమైనది, కచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పారు. రష్యా దాడిలో తొలి నాలుగు రోజుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని, 45 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వీరంతా ఉక్రెయిన్ హీరోలుగా జెలెన్స్కీ అభివర్ణించారు.