శుక్రవారం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర అధికారులతో కలిసి అంబర్ పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబర్ పేటలో పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
వీధి చివర్లలో ఉండే చెత్త కుండీలు, బస్తీల్లో ఉంటున్న డంపింగ్ యార్డ్ లు నిత్యం ఖాళీ చేయించాలని, డ్రైనేజీ లైన్ల నిర్వహణ మెరుగ్గా చేయాలని, మురుగు నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు.
అదే విధంగా ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇంటిలోని చెత్తను సమీప నివాస ప్రాంతాల్లో వేయకుండా, జీహెచ్ఎంసీ నుండి వచ్చే స్వచ్ఛ ఆటో లకే చెత్తను అందించాలని సూచించారు.
కాచిగూడ డివిజన్ లోని వైఎంసీఏ, లింగంపల్లి చౌరస్తా, కుత్బిగూడ, చప్పల్ బజార్, గోల్నాక డివిజన్ లోని న్యూ బ్రిడ్జి, జిందా తిలిస్మాత్ రోడ్డు, డీ-మార్ట్ లైన్, వడ్డెర బస్తీ మొదలైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే, కమిషనర్, అధికారుల బృందం పర్యటించింది.
ఇటీవలే జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రోనాల్డ్ రోస్ కి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఏఎంహెచ్ఓ డా. జ్యోతి, డీఎంసీ వేణుగోపాల్, ఈఈ శ్రీ పేరిరాజు తదితర అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్