ఏపిలో ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలకు తెరపడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. విశాఖపట్నం జిల్లా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దానికి సన్నద్ధం కావల్సి ఉంది అని చెప్పారు.
దాంతో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం లేనట్టేనని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. విశాఖపట్నం రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం. ఈ నగరంలో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే దాదాపు 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి. అంత పారదర్శకత కనిపిస్తోంది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనమంతా ఆలోచన చేయాలి. ఎందుకు 175కి 175 సాధ్యం కాదు. ఇది కావాలంటే రెండు జరగాలి. ఒకటి నేను చేయాల్సిన పని నేను చేయాలి. ఎక్కడ తప్పు జరగక్కుండా…కచ్చితంగా క్యాలెండర్ ప్రకారం నెల, నెలా బటన్ నొక్కడం నేను చేయాలి.
ఈ నెలలో ఈ పథకం ఇస్తామని మొట్టమొదటిసారిగా బడ్జెట్ అన్నదానికి నిర్వచనం మార్చాం. గతంలో ఇలా ఎప్పుడూ క్యాలెండర్ ప్రకారం జరగలేదు. అదే విధంగా నేను చేయాల్సిన పని నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. నాకు ఎన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి ప్రజల సమస్యలను నా సమస్యలు కన్నా ఎక్కువని గమనించి… వాటిని తీర్చే విధంగా బటన్ నొక్కే కార్యక్రమం నేను చేయాలి. అదే విధంగా మీరు చేయాల్సినవి మీరు చేయాలి. ఈ రెండూ జరగాలి. మీరు కచ్చితంగా ప్రతిగడపకూ వెళ్లాలి. ప్రతి గడపలో మనం చేస్తున్న పనులకి సంబంధించి వివరాలతో సహా వెళ్తున్నారు.
ఆ ఇంట్లో అక్క, చెల్లెమ్మ పేరుతో జరిగిన మంచిని వారికి వివరిస్తూ… గుర్తు చేస్తూ… ప్రజల ఆశీస్సులు కూడా తీసుకోవాలి. అంతే కాకుండా ఆ వార్డులో జన్యూన్ కారణాలతో ఎవరైనా మిస్ అయితే… వాటిని కూడా పరిష్కరించాలి అని ఆయన చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం దగ్గరుండి పరిష్కరించి వాటిని లేకుండా చేయాలి. ఇలా నేను చేయాల్సింది నేను, మీరు చేయాల్సింది మీరు..ఈ రెండింటి కాంబినేషన్ జరిగితే 175 కి 175 వై నాట్ ? ఇది కచ్చితంగా జరగాలి. అందరూ కలిసి ఒక లక్ష్యంతో పనిచేయాలి.
ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే… ఆ తర్వాత 30 యేళ్లు పాటు మనమే ఉంటాం అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో విశాఖ వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు తదితరులు పాల్గొన్నారు.