నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నగరంలో వైన్స్ షాపుల ముందు సామాజిక దూరం పాటించకుండా మందు కొనుగోలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు చిన్నాచితక వ్యాపారస్తుల పై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. గురువారం ఓ చిరు వ్యాపారిపై మున్సిపల్ కమిషనర్ చిందులేశారు.
నీ షాప్ సీజ్ చేస్తాం అని నీవు నిబంధనలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే దుకాణం తెరిచానని తన దగ్గరకు కమిషనర్ వచ్చినప్పుడు కొనుగోలుదారులు ఎవరూ లేరని షాపు ముందు చాక్ పీస్ తో గీసిన డబ్బాలు నిన్నటివి చెరిగిపోవడంతో అప్పుడే గీయటానికి ప్రయత్నిస్తుండగా కమిషనర్ తనను హెచ్చరించారని అతను వాపోతున్నాడు.
నిబంధనలు పాటించాలని షాప్ సీజ్ చేస్తానని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సార్ నా దగ్గర సామాజిక దూరం పాటించకపోవడానికి ఇక్కడ ఎవరూ లేరని డబ్బాలు నిన్నటివి చెడిపోవడంతో ఇప్పుడు మళ్లీ గీస్తున్నానని తెలుపగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న వ్యాపారస్తుల పై అధికారులు తమ జులూం ప్రదర్శిస్తున్నారు.
వైన్ షాపుల ముందు సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండా వైన్స్ యజమానులపై గాని కొనుగోలుదారుల పై గాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బ్రతుకు జీవుడా అంటూ బ్రతికే వారినే భయబ్రాంతులకు గురి చేయడం అధికారుల చేత కాని తనానికి నిదర్శనమని నగరవాసులు విమర్శిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కల్వకుర్తి కచ్చితంగా కరోనా బారిన పడే అవకాశం లేకపోలేదని సామాజిక దూరం పాటించకుండా మాస్కు ధరించకుండా కొందరిని ఉపేక్షిస్తే అందరూ బాధపడాల్సిందేనని నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎవరిని ఉపేక్షించకుండా తన మన భేదం లేకుండా మాస్కులు ధరించే విధంగా, సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.