రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు చాలామంది జీతాలు, పింఛన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈ నెల రెండో తారీకు దాటినా చాలామంది ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. ఉద్యోగులకు సగం మందికి అందినా, పింఛనుదారుల్లో వేల మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. చాలినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతో అన్నింటికీ సర్దుబాట్లు తప్పడం లేదు. ఫలితంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో జీతాలు, పింఛన్ల కోసం ప్రతినెలా రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉన్న నిధుల మేరకు గురువారం కొందరికి, శుక్రవారం మరికొందరికి జీతాలు జమ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు అందాయి. జిల్లాలు, వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలామంది తమకు ఇంకా రాలేదని పేర్కొంటున్నారు.
ముందుగా బిల్లులు సమర్పించిన కొద్దిమందికి జీతాలు జమ చేసినా అనేక జిల్లాల్లో ఇంకా పెండింగులో ఉన్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పింఛన్లు జమ కాలేదని, ఈ మేరకు తనకు ఫోన్లు వస్తున్నాయని పింఛనుదారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. తమకే జమ కాలేదా, అందరికీ రాలేదా అన్న విషయంలో స్పష్టత లేక పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. శనివారమైనా అందుతాయా అన్నది అనుమానమే.