ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని తేలిపోయింది. కిమ్ జోంగ్ ఉన్ నెల రోజుల తర్వాత అజ్ఞాతం వీడారు. గత 35 రోజులుగా ఆయన ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ అంతర్జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
2014 తర్వాత ఆయన ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం ఇదే తొలిసారి. ఆయన ప్రభుత్వ మీడియాలో కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం, ఆచూకీపై పలురకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కిమ్.. చైనా సరిహద్దులో నిర్మిస్తున్న కొత్త నగరం వద్ద ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన పూర్తి ఆరోగ్యవంతంగా, సురక్షితంగా ఉన్నట్లు తేలిపోయింది.
2018 నుంచి కిమ్ ఇక్కడ పలుసార్లు పర్యటించి.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను నేరుగా పర్యవేక్షించారు. మూడో దశ పనులను సందర్శించేందుకు కిమ్ అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికల్లా అక్కడ నిర్మాణ పనులు ముగియనున్నాయి. గతంలోనూ కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో కనిపించకుండా పోయినప్పుడు ఆయన ఆరోగ్యంపై పలు రకాల పుకార్లు వినిపించాయి.