కడప జిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్ లో భూ కబ్జాల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సబ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ఆధారంగా పని చేయాలని అధికారులు భూ కబ్జాల తొలగింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల మొదటి నుంచి చివరి రోజు వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని మండలాల్లోని తాసీల్ధార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం వాగులు, వంకలు,చెరువులు, కాలువలు, గ్రామాల్లో ఈ నెల ఆఖరు వరకు భూ కబ్జాల తొలగింపు కు శ్రీకారం చుట్టారు.
భూ బకాసురులు అన్ని మండలాల్లో ని గ్రామాల్లో కోట్లాది రూపాయల విలువ గల వ్యవసాయ భూములు ,ఇండ్ల స్థలాల కోసం యథేచ్ఛగా అక్రమించారు.ఖాళీగా ఉన్న భూములను దర్జాగా రాజకీయ అండదండలతో గత ప్రభుత్వం లో అక్రమించగా, ప్రస్తుతం అది పరాకాష్ట కు చేరింది.
ఈ కబ్జాలు స్థానిక విఆర్వో సహకారం తో పాటు తాసీల్ధార్ల కు తెలియకుండా జరిగే అవకాశం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వారే సబ్ కలెక్టర్ ఆదేశాలతో తొలగింపు చేస్తున్నారు. ఈ కబ్జాల తొలగింపు న్యాయ బద్దంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ,డబ్బు పలుకు బడి ఉన్న వారి భూ కబ్జాలను చూసి చూడనట్టు వదిలేసి,పేద వారి భూముల పై ప్రతాపం చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వందల ఎకరాలు వదిలేసి తూతూ మంత్రంగా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం లో అర్ధం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొండలను సైతం చదును చేసి ఎకరాలకు ఎకరాలు ఆక్రమించిన సందర్భంలో చూసి చూడనట్టు ఉన్న రెవెన్యూ అధికారులు ఇప్పుడు హడావుడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పేద వాడి సెంటు స్థలం కోసం సవాలక్ష నిబంధనలు చెప్పే రెవెన్యు సిబ్బంది, ఎకరాల కొద్దీ భూములను కబ్జా చేసే వారికి వత్తాసు పలకడం పరిపాటయ్యింది.
భూ కబ్జాల తొలగింపు ఉద్దేశ్యం మంచిదే అయ్యినప్పటికి రెవెన్యుశాఖలోని కొందరి ఇంటి దొంగల మూలంగా దాని లక్ష్యం నీరు గారుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి భూ కబ్జాలపై సహించనని ఆదేశాలు జారీ చేసినప్పటికి క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం ప్రభావం కనిపెంచడం లేదు.