పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం-పురుషోత్తమ పట్నం మధ్య ఓగేరు వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొప్పూడి గ్రామానికి చెందిన బత్తుల అనిల్, అంకమ్మరావులు చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. ఇద్దరూ గురువారం ఉదయం చిలకలూరిపేటలో బేల్దారు పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు.
మార్గమధ్యంలో ఓగేరు వాగులో మురికిగా ఉన్న బట్టలు ఉతికేందుకు బత్తుల అనిల్ (20) వాగులోకి దిగాడు. బట్టలు ఉతికే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి గల్లంతయ్యాడు. ఇది చూసిన సోదరుడు అంకమ్మరావు వెంటనే సమాచారం కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు.
వారంతా వాగు వద్దకు చేరుకొని రాత్రి 11 గంటలకు వరకు వెతికినా యువకుడి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. కుమారుడు అనిల్ ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.