ఉమ్మడి కడపజిల్లా ఒంటిమిట్ట చెరువులోకి సోమశిల వెనుక జలాలను తరలించే శ్రీరామ ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేసిన కొన్ని గంటలకే మళ్లీ నిలిచిపోయింది. ఒంటి మిట్ట చెరువు కింద 1,014 ఎకరాల ఆయకట్టుకు నీరందించ దానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు,ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గా ఉండగా రూ.34.80 కోట్ల అంచనాలతో పథకాన్ని నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.
కాసుల కష్టంతో నిరుపయోగంగా వదిలేశారు.దీనిని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ నుంచి నీటిపారుదల (మైనర్ ఇరిగేషన్) శాఖకు ఇటీవల బదలాయించారు. గత వారం రోజులుగా మోటార్లు,పంపులు, ప్యానెల్ బోర్డులు విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతులు చేశారు. ట్రయల్ రన్ కూడా వేశారు. చిన్నపాటి సమస్యలు తప్ప అంతా బాగుండటంతో ఆదివారం రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, ఈఈ వెంకట్రామయ్య చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు.
మూడేళ్ల తర్వాత సోమశిల వెనుక జలాల సవ్వడి చూసి ఈ ప్రాంత ప్రజలు ఎంతో మురిసి పోయారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పంపహౌస్ సమీపంలోని గేట్ వాల్వ్ వద్ద లీకులు ఏర్పడ్డాయి. దీంతో చేసేదేమిలేక మోటార్లను ఆపేశారు. ఎమ్మెల్యే. ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. ఈ విషయంపై ఈఈ వెంకట్రామయ్య మాట్లాడుతూ లీకులకు వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.