అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను విజయవంతం చేయాలని విజయనగరం ఆర్డీఓ భవానీ శంకర్ కోరారు. పైడితల్లి ఉత్సవాలకు సంబంధించి, తమ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఆయా శాఖల పరంగా నిర్వర్తించాల్సిన విధులపై చర్చించారు.ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు ప్రతీఒక్కరూ ప్రతిష్టగా తీసుకోవాలని కోరారు.
ప్రతీచోటా కరోనా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. కరోనా సర్టిఫికేట్ ఉన్నవారిని మాత్రమే ప్రసాదాల తయారీకి అనుమతించాలని సూచించారు. భక్తులకు మజ్జిగ, త్రాగునీటి పంపిణీకి వలంటీర్లను వినియోగించాలన్నారు. శానిటేషన్, త్రాగునీటి సరఫరా బాధ్యతను మున్సిపాల్టీ నిర్వర్తిస్తుందన్నారు. 17 నుంచి 19వ తేదీ వరకూ మూడు రోజుల పాటు బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బారికేడ్లు, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ఈ ఏడాది కూడా అమ్మవారి ఉచిత దర్శనాలు లేవని, ఇప్పటికే ఆన్లైన్ లో టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు, కంట్రోల్ రూము నుంచి కోట, గంటస్థంభం, సింహాచలం మేడ, కన్యకాపరమేశ్వరి కోవెల వరకు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ను ఏర్పాటు చేయాలని, సమాచార, రేడియో ఇంజనీర్లను ఆదేశించారు.
ఎక్కడికక్కడ సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి, నిరంతరం జాతరను పర్యవేక్షించాలన్నారు. కంట్రోలు రూము సమీపంలో ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, పార్కింగ్ స్థలాలను పక్కాగా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఆలయం వెనుక ద్వారం నుంచి ఏ ఒక్కరినీ లోపలికి అనుతించే ప్రసక్తే లేదని ఆర్డీఓ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డీఎస్పీ అనిల్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు, తహశీల్దార్ ఎం.ప్రభాకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.