గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పల్లె ప్రగతి రూపొందించారని ఆయన అన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలోని పాపాటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన సభలో మాట్లాడుతూ బుగ్గవాగు ప్రాజెక్ట్ కి టెండర్ పిలిచామని రూ. 40కోట్లు నిధులు ఇచ్చామని మంత్రి తెలిపారు.
దీని ద్వారా రోడ్డు ఇటు వైపు ఉన్న అన్ని చెరువులు నిండుతాయని, సీతారామ ప్రాజెక్ట్ కంటే ముందే సాగునీరు పుష్కలంగా ఉంటాయని మంత్రి అన్నారు. మున్నేరులో నిలువ ఉన్న నీరు ఇక సద్వినియోగించుకోవచ్చునని మంత్రి పువ్వాడ అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుపడ్డాయని గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా మలుచుకోవాలని ఆయన తెలిపారు.
ఏ గ్రామాలు పల్లె ప్రగతి లో విజయాలు సాధిస్తాయో వాటికే అభివృద్ధి నిధులు ఎక్కువ వస్తాయని మంత్రి తెలిపారు. అలా చేయని గ్రామాలకు నిధులు ఇచ్చేది లేదని అందువల్ల మీరే ఇబ్బంది పడతారని మంత్రి అన్నారు. ఇంటింటికి తడి, పొడి చెత్త డబ్బాలను మంత్రి అందజేశారు. అనంతరం నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ సురభి, ZP CEO ప్రియాంక, DRDA PD ఇందుమతి, AMC చైర్మన్ వెంకటరమణ, విద్యుత్ SE రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీ, అధికారులు పాల్గొన్నారు.