జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిరాజేశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పవన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయగా మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతే గాకుండా అవకాశం దొరికిందని వైకాపా మంత్రులు, ప్రజా ప్రతినిధులు పవన్ పై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు.
వాలంటీర్లపై పవన్ ఏలూరు సభలో ఊహించని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొందరు మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్లు అని, వైసీపీ కనుసన్నల్లో పనిచేస్తున్న వాలంటీర్లు, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. మహిళలు ఎంతమంది ఉన్నారు..వితంతవులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని ఆ సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఒంటరి మహిళలే వాలంటీర్ల టార్గెట్ అని, దీనికి సంబంధించి కేంద్రంలోని ఇంటిజెన్స్ అధికారి తనకు సమాచారం ఇచ్చారని అన్నారు.
దీనిపై వాలంటీర్లు భగ్గు మంటున్నారు.ప్రతి గ్రామంలో సేవే పరమావదిగా భావిస్తూ, వృద్ధుల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు పక్కాగా చేరుస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు రాజకీయాల్ని ఆపాదించి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ అవమానించడం దారుణమని మండిపడుతున్నారు.
హ్యూమన్ ట్రాఫికింగ్లో వాలంటీర్ల హస్తం ఉందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ నిఘా సంస్థ అయితే తనకు డేటా ఇచ్చిందో, అందుకు సంబంధించిన వివరాల్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని కోరుతున్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. అసలు తమ వాలంటీర్లు ఏం చేశామని పవన్ ఇలా వ్యాఖ్యానించారంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడిన మాటలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలపై, వాలంటీర్ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. పవన్ క్షమాపణ చెప్పాలని లేకపోతే.. మహిళా లోకం సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, చాలా జాగ్రత్తగా ఉండాలని, తమని తక్కువ చేసి చూడొద్దని పేర్కొంటున్నారు.
పవన్ ఆరోపణలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అటు మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ పవన్ కు సమాచారం అందించిన ఆ అధికారి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. బిజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలు మిస్ అవ్వడం లేదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ పవన్కు నోటీసులు జారీ చేయగా, వరుసగా వాలంటీర్లు పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు
డిమాండ్ చేస్తున్నారు. పవన్కు సిగ్గు శరం లేదని, రాజకీయాల్లో ప్యాకేజ్ స్టార్ట్గా మిగిలిపోతారని అన్నారు. మొత్తం మీద పవన్ ను దెబ్బ తీసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న అధికార వైసీపీ నేతలకు తాజాగా పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ అస్త్రంగా మారాయి. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది.. ఎదురు చూడాల్సిందే.